వేములవాడ, వెలుగు:- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానానికి చెందిన తిప్పాపురం గోశాలకు రైతులు భారీగా ఎండు గడ్డిని విరాళంగా అందజేశారు. పెద్దపల్లి జిల్లా కనుకుల, మారుతినగర్, రామునిపల్లి, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకీరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ సభ్యులు ఈసారి 65 ట్రాక్టర్ల ఎండు గడ్డిని గోశాలకు అందించారు.
ఐదేళ్లుగా ఈ రైతులు గోశాలకు సేవలు అందిస్తున్నారు. మొదట 10 ట్రాక్టర్లతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం, గత ఏడాది 45 ట్రాక్టర్లకు చేరుకోగా, ఈ ఏడాది 65 ట్రాక్టర్ల ఎండు గడ్డిని విరాళంగా అందజేశారు. దేవస్థానం డీఈవో భాస్కర శర్మకు గడ్డిని అందజేశారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి పాల్గొన్నారు.
రైతులకు స్వామివారి దర్శనం..
గోశాలకు ఉచితంగా గడ్డి అందజేసిన రైతులకు భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదం అందజేశారు. ఈవో ఎల్.రమాదేవి మాట్లాడుతూ గోశాలకు ఎండు గడ్డి, పచ్చ గడ్డి, కూరగాయలు, పండ్లు, ఫలాలు అందిస్తున్న భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భక్తులు నేరుగా గోశాలకు వచ్చి సహాయం అందించవచ్చని చెప్పారు.
